టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు సయోధ్యతో ముగిసింది. గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను.. మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. నాగార్జునను.. వారి కుటుంబ సభ్యులను కించపరిచే ఉద్దేశం తనకు లేదని.. చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. ఆమె పశ్చాత్తాపాన్ని అంగీకరించిన నాగార్జున.. ఈ కేసును విత్డ్రా చేసుకున్నారు. దీంతో దాదాపు ఏడాది కాలంగా నలుగుతున్న ఈ వివాదం ముగిసింది.