తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను ఒకేసారి రూ.12 వేలు జమ చేయాలని యోచిస్తోంది. జూన్ మూడో వారం నాటికి ఈ సాయం అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దాదాపు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే.. దీనికి రూ.15 వేల కోట్లకు పైగా నిధులు అవసరం కావడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఇటీవల పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున సాయం అందించింది.