సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న భక్తులకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శుభవార్త తెలిపారు. ఆలయం సమీపంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన రైల్వే స్టేషన్ పనులు 96 శాతం పూర్తయ్యాయని ఆయన 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. పనులు చివరి దశలో ఉన్న ఈ స్టేషన్, అతి త్వరలో ఆధునిక సౌకర్యాలతో భక్తులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఈ రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఈ నిర్మాణం వలన ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుంది.