హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చిట్యాల వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు చిట్యాల వద్ద గల రైల్వే వంతెన కింద వరద నీరు చేరడం ప్రధాన కారణం. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ హైవేపై ఇండస్ట్రీయల్ ట్రాన్స్ పోర్ట్ పెరగడం కూడా రద్దీకి మరొక కారణం.