గత ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖ సెంట్రల్ జైలులో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలతో ఆమె విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించారు. జైలులో గంజాయి వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయన్నారు. విశాఖ సెంట్రల్ జైలు లోపల వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే కొంతమందిని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇతర జైళ్లకు బదిలీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. విశాఖ జైలులో ఘటనలపై కమిటీ వేసినట్లు చెప్పారు. పది రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖ సెట్రల్ జైలు నుంచి కొంతమంది ఖైదీలను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్నాం. గత ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులు సెంట్రల్ జైలును సందర్శించిన దాఖలాలు లేవు అన్నారు.