మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం సహాయం ప్రకటించింది. ఈ మేరకు దెబ్బతిన్న ఇళ్లకు సహాయం అందించడానికి రూ. 12.99 కోట్లు విడుదల చేస్తూ రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ల నివేదికల ప్రకారం.. మొత్తం 8,662 ఇళ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దెబ్బతిన్న ప్రతి ఇంటికి రూ.15,000 చొప్పున సాయాన్ని నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఈ ఆర్థిక సహాయం వరద బాధితులకు కొంతమేర ఊరట కలిగించనుంది.