మహబూబాబాద్ జిల్లాలో వారం రోజుల క్రితం కురిసిన గాలివాన బీభత్సానికి 140 సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ముత్యాలమ్మ మర్రి చెట్టు నేలమట్టమైంది. వేర్లతో సహా పెకిలించేసినట్లు కూలిపడటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ పూర్వీకుల జ్ఞాపకాలకు సాక్ష్యంగా ఉన్న ఆ మర్రి చెట్టు నెలకొరగటంతో శోకసంద్రంలో మునిగిపోయారు. గుడిలో దేవతను ఎలా కొలుస్తారో.. అదే దైవత్వంతో పూజించే ఆ మర్రి చెట్టు కూలిపోవటం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. తమ పూర్వీకుల జ్ఞాపకంగా భావించే ఆ చెట్టును తిరిగి నిలబెట్టాలని గ్రామస్థులు సంకల్పించారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు కలిసి చర్చించి, తమ ప్రయత్నంతో మళ్లీ నిలబెట్టారు.