తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యావరణ పరిరక్షణ, గాలి నాణ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక అభివృద్ధితో పాటు స్వచ్ఛమైన గాలిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గాలి కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు రెండో ప్రధాన కారణంగా మారిందని.. ఇది ప్రజారోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు ప్రభుత్వం 40 కొత్త మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని, ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇస్తూ.. 2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సుస్థిర అభివృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.