ఒకే వరుడు ఇద్దరు బాలికలను వివాహం చేసుకునేందుకు సిద్ధమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు రంగప్రవేశం చేసి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వివాహం నిలిచిపోయింది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లలో మంగళవారం చోటుచేసుకుంది. గోరంట్లకు చెందిన ఓ వరుడు, కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన మైనర్లయిన అక్కాచెల్లెళ్లను ఒకే ముహూర్తానికి గురువారం వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కల్యాణ మండపంలో ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఇక పెళ్లి పత్రిక వాట్సప్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొట్టింది. ఆ నోట.. ఈ నోట విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు మంగళవారం ఈ పెళ్లి తంతుపై ఆరా తీశారు. అయితే, అమ్మాయిల్లో ఒకరికి 16, ఇంకోకరికి 15 ఏళ్లు ఉంటాయని వారి విచారణలో తేలింది. దీంతో ఇరువర్గాల తల్లిదండ్రులు, బంధువులతోపాటు కల్యాణ మండపం నిర్వాహకుడిని పోలీసు స్టేషన్ వద్దకు పిలిపించారు. సీఐ శేఖర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.