హైదరాబాద్ ఐటీ కారిడార్లోని దుర్గం చెరువును కబ్జాల నుంచి విడిపించేందుకు హైడ్రా (HYDRAA) భారీ చర్యలు చేపట్టింది. మాధాపూర్ ఇనార్బిట్ మాల్ వైపు ఉన్న సుమారు 5 ఎకరాల చెరువు భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ మట్టిని నింపి, అక్రమంగా వాహనాల పార్కింగ్ నిర్వహిస్తూ నెలకు రూ. 50 లక్షల వరకు అద్దె వసూలు చేస్తున్న దందాకు చెక్ పెట్టారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో ఈ ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేశారు. గతంలో 160 ఎకరాలు ఉన్న ఈ చెరువు, ఆక్రమణల వల్ల 116 ఎకరాలకు కుంచించుకుపోవడంపై హైడ్రా సీరియస్ అయింది.