హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) ఒకటి. కేపీహెచ్బీ ప్రాంతంలో అనేక షాపింగ్ మాల్స్, దుకాణాలు, రెస్టారెంట్లు ఉండటంతో రద్దీగా ఉంటుంది. అయితే ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్నా.. కేపీహెచ్బీ ప్రాంతం నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. ముఖ్యంగా కూకట్పల్లి మెట్రో స్టేషన్, బస్టాండ్లలో దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా.. అక్కడి దారుణ పరిస్థితిని వివరిస్తూ.. ఓ యువకుడు హైదరాబాద్ సిటీ పోలీసులకు ట్వీట్ చేశారు. కేపీహెచ్బీ బస్టాండ్లలో కొందరు వ్యక్తులు ట్రాన్స్జెండర్లుగా చెప్పుకుంటూ యువకులను వేధిస్తున్నారని కంఫ్లైంట్ చేశాడు. అమాయకంగా, సిగ్గుగా ఉండే కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు. రూ.10, రూ.20 ఇస్తే వినిపించుకోకుండా బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని.. క్యూఆర్ కోడ్ ద్వారా రూ.100 ఆపైన యూపీఐ పేమెంట్ చేయాలని బెదిరిస్తున్నారన్నారు. ఎవరైనా యువకులు ప్రతిఘటిస్తే.. వారిని బహిరంగంగా అసభ్య పదజాలలతో దూషిస్తూ, ప్రవర్తిస్తూ, వారి ముందే దుస్తులు విప్పేస్తామని బెదిరిస్తూ అవమానిస్తున్నారన్నారు.