‘వాడెవడు.. వాడి పెత్తనం ఏమిటిక్కడ?’.. అంటూ అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆలయ పీఆర్ఓను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో గురువారం స్వామివారి కళ్యాణం ముగిసిన అనంతరం అక్షింతలు ఆలస్యమవడంతో అనంతబాబు.. ఆలయ అధికారులపై ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తనకు తగిన గౌరవం ఇవ్వలేదంటూ హడావుడి చేశారట. అక్షింతలు ఇవ్వలేదని కళ్యాణ వేదిక వద్దే ఉండిపోయారని సమాచారం. ముఖ్యఅతిథులు వెళ్లిపోయినా అక్కడే ఉండి తనకు అక్షింతలు ఇవ్వాలని పట్టుబట్టారట. ఈవో సుబ్బారావును రప్పించి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజువల్స్ బయటికి వచ్చాయి. ఈ సమయంలోనే ఆలయ పీఆర్ఓను వాడెవడు.. వాడి పెత్తనం ఏంటి ఇక్కడ అంటూ దూషణలకు పాల్పడి అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతబాబు అనుచరులు సైతం.. పీఆర్ఓకి ఓవరాక్షన్, వెధవ వేషాలు అంటూ దూషించారు.