Nuzvid IIIT: ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేసిన విద్యార్థి.. కారణమదే

6 months ago 7
నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ప్రొఫెసర్‌పై ఓ విద్యార్థి కత్తితో దాడి చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. పరీక్షలకు అనుమతించలేదన్న కారణంతో ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రొఫెసర్‌కు చికిత్స అందిస్తున్నారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విజయనగరానికి చెందిన మజ్జి వినాయక పురుషోత్తం అనే విద్యార్థి ఎంటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో ఎంటెక్‌ విద్యార్థులకు రెండో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, మజ్జి వినాయక పురుషోత్తం సోమవారం ఉదయం పరీక్ష కేంద్రానికి వచ్చాడు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న సివిల్‌ విభాగం అధ్యాపకుడు ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు.. నీకు సరిపడా అటెండెన్స్ లేదని, హెచ్‌వోడీని కలవాలని ఆ విద్యార్థికి సూచించారు.అతడు హెచ్‌వోడీని కలవగా.. అటెండెన్స్ లేనందున పరీక్షకు అనుమతించలేమని చెప్పారు. విద్యార్థి తిరిగి పరీక్ష కేంద్రానికి వచ్చి.. హెచ్‌వోడీ మీ వద్దే అనుమతి తీసుకోవాలని చెప్పారని అన్నాడు. వెంటనే ప్రొఫెసర్ హెచ్‌వోడీకి కాల్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టి మరి.. విద్యార్థి ముందు మాట్లాడాడు. అప్పుడు హెచ్‌వోడీ.. తాను అనుమతించలేదని చెప్పారు. వెంటనే ప్రొఫెసర్ కాల్ కట్ చేసి.. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నారు. అయినా ఆ విద్యార్థి వినకుండా.. వెళ్లి ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నాడు. బయటకు వెళ్లాలని ప్రొఫెసర్ చెప్పారు. అయినా వెళ్లకపోవటంతో సెక్యూరిటీని పిలిచాడు. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి తన జేబులో నుంచి చిన్నపాటి కత్తి తీసి ఆచార్యుడిపై దాడికి దిగాడు. కొందరు విద్యార్థులు అతడిని నిలువరించి, కత్తి లాగేసుకున్నారు. కానీ, ఆలోపే నాలుగు సార్లు కత్తితో దాడి చేశాడు. జేబులో ఉన్న మరో కత్తి తీసి దాంతోనూ ప్రొఫెసర్‌పై దాడి చేస్తుండగా మిగిలిన విద్యార్థులందరూ ఏకమై పురుషోత్తంను వెనక్కి లాగి, గదిలో బంధించారు. గాయపడిన అధ్యాపకుడిని నూజివీడు లోకల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆయనకు నుదురు, మెడ పైభాగం, భుజంపై నాలుగైదు చోట్ల గాయాలయ్యాయి. సెంటీమీటరు లోపలకు కత్తి దూసుకెళ్లిందని, ప్రాణపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు. పురుషోత్తంను అరెస్టు చేసినట్లు నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు.
Read Entire Article