ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనను నిర్దోషిగా ప్రకటించిన న్యాయ వ్యవస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసు విషయంలో పన్నెండున్నరేళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఎన్ని అపవాదులు వచ్చినా తన నియోజకవర్గ ప్రజలు మాత్రం తనకు అండగా నిలిచారన్నారు. ఏ తప్పూ చేయకపోయినా ఈ కేసులో తనను చేర్చడంపై బాధ పడ్డానని.. న్యాయ వ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరుగుతుందని నమ్మానన్నారు. ఈరోజు అదే జరిగిందని.. కానీ, ఇన్నేళ్లుగా తాను పడిన అవమానాలు, ప్రతిపక్షంలో ఉన్నవారు తను అవినీతిపరురాలినని,.. జైలుకు పోతానని మాటలు అంటుంటే ఎంతో బాధపడ్డానన్నారు. అలా ప్రచారం చేసినా తన జిల్లా ప్రజలు, నియోజకవర్గం ప్రజలు తనపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచారన్నారు. ఎవరెన్ని మాట్లాడినా నమ్మకుండా తనను గెలిపిస్తూ వచ్చారన్నారు. ఇన్నేళ్లుగా నాతో పాటు ఉండి ధైర్యం చెప్పిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.