దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయి. శనివారం ఏఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భూములను పరిశీలించారు. ప్రభుత్వం ఇప్పటికే 253 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించి, రూ. 295 కోట్ల పరిహారాన్ని రైతులకు అందజేసింది. దీంతో మొత్తం భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. జనవరి 2026లో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించే అవకాశం ఉంది. 2027 చివరి నాటికి విమాన సర్వీసులు ప్రారంభించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. అయోధ్య, కొచ్చిన్ విమానాశ్రయాల తరహాలో దీనిని అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దనున్నారు.