వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో రూ. 600 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని నోయిడా తరహాలో తెలంగాణను తీర్చిదిద్దాలనే సీఎం రేవంత్రెడ్డి సంకల్పంలో భాగంగా 248 ఎకరాల్లో ఈ మెగా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్, పశువైద్య కళాశాలలు కొలువుదీరనున్నాయి. దీని ద్వారా వెనుకబడిన కొడంగల్ పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 4 వేల మంది గ్రామీణ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత చదువులు అందనున్నాయి.