తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇండియా- పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల కంచుకోటగా భావిస్తున్న కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్న CRPF బలగాలను వెంటనే వెనక్కి రావాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. తెలంగాణ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా మోహరించిన CRPF కోబ్రా ప్రత్యేక దళాల జవాన్లు వెంటనే తమ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు అందాయి. దీంతో ములుగు జిల్లాలోని సున్నితమైన ప్రాంతాల నుంచి బలగాలు ఆపరేషన్ సిందూర్లో పాల్గొనడానికి హుటాహుటిన బయలుదేరుతున్నాయి.