మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానం మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛ పొందింది. ప్రత్యేక దేశంగా లేదా పాకిస్థాన్లో కలవాలన్న నిజాం ఆలోచనకు అడ్డుకట్ట వేస్తూ.. అప్పటి భారత ప్రభుత్వం 'ఆపరేషన్ పోలో'కు ఆదేశించింది. ఆరు నెలల వ్యూహాత్మక సన్నాహాల తర్వాత ప్రారంభమైన ఈ సైనిక చర్య కేవలం ఐదు రోజుల్లో ముగిసింది. ఇందులో నిజాం సైన్యం లొంగిపోవడంతో హైదరాబాద్ భారత్లో అంతర్భాగమైంది. ఈ సైనిక చర్యకు అయిన సుమారు రూ. 6 కోట్ల ఖర్చును నిజాం ప్రభుత్వమే భరించాల్సి వచ్చింది. అలా 224 ఏళ్ల నిజాం పాలన ముగిసింది.