కామారెడ్డి జిల్లా ఉప్పలవాయి గ్రామంలో ఒక వింత ఘటన జరిగింది. వార్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయిన బాబవ్వ అనే అభ్యర్థి, ఓటర్లను అసభ్య పదజాలంతో దూషించడంతో గొడవ మొదలైంది. తాను పంచిన మద్యం సీసాలు, చీరలు, శీతల పానీయాలు తీసుకుని తనకు ఓటు వేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాటలకు విసిగిపోయిన వార్డు ప్రజలు, ఆమె ఇచ్చిన వస్తువులన్నింటినీ మూటగట్టుకుని వచ్చి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పారేసి నిరసన తెలిపారు. ‘మేము అడగకుండానే బహుమతులు ఇచ్చి, ఇప్పుడు ఓడిపోయాక తిట్టడం ఏంటి?’ అని వారు నిలదీశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.