ఏపీలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ నుంచి మరో ప్రతిపాదన కేంద్రం వద్దకు చేరింది. ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో అల్యూమినియం స్మెల్టర్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఒడిశాలోని దమంజోడి రిఫైనరీకి విజయనగరం దగ్గరగా ఉంటుందని.. ఇక్కడ నాల్కో ద్వారా అల్యూమినియం స్మెల్టర్ ఏర్పాటు చేయిస్తే.. కేంద్రానికి ముడిసరుకు సరఫరా ఖర్చు తగ్గటంతో పాటుగా జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీనివాస్ కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.