టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా.. రహత్నగర్ అభివృద్ధి కోసం తన సొంత ఆస్తిలో 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి గొప్ప దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ భూమిలో 10 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి.. 1 ఎకరాన్ని విద్యుత్ సబ్స్టేషన్ విస్తరణకు కేటాయించారు. దీనివల్ల గ్రామంలో విద్యా, మౌలిక వసతులు మెరుగుపడతాయి. ధర్మపురి-బాసర టెంపుల్ కారిడార్ రోడ్డు రహత్నగర్ మీదుగా వచ్చేలా కృషి చేసినందుకు ఆయన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. చివరి శ్వాస వరకు గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.