హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. నగరంలో మొత్తం నేరాలు 15 శాతం తగ్గాయని.. ముఖ్యంగా సైబర్ క్రైమ్, హత్యలు, కిడ్నాప్ కేసులు తగ్గుముఖం పట్టాయని ఆయన వెల్లడించారు. అయితే.. మహిళలపై నేరాలు, పోక్సో కేసులు పెరగడంపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. న్యూ ఇయర్ వేడుకల వేళ 'జీరో డ్రగ్స్' లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడితే జైలు శిక్ష తప్పదని.. పబ్లు, హోటళ్లు రాత్రి 1 గంటకే మూసివేయాలని స్పష్టం చేశారు. రూ. 6.45 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేశామని, ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు.