తెలంగాణలో కొత్తగా రెండు లక్షల మందికి చేయూత పింఛన్లు అందజేస్తామని మంత్రి సీతక్క అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే లక్ష పింఛన్లు మంజూరు చేశామని, తాజా బడ్జెట్లో వీటికి భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. పింఛన్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. కేవలం అనర్హులు, మరణించిన వారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే 60 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేక పొదుపు సంఘాల ఏర్పాటు, మహిళా భద్రత కోసం పాఠ్యపుస్తకాల్లో ప్రత్యేక పాఠ్యాంశాల వంటి వినూత్న ప్రతిపాదనలను ఆమె వివరించారు.