హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగిస్తూ ఎల్అండ్టీ సంస్థ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రయాణికుల సౌకర్యార్థం అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా రాత్రి 11 గంటలకే ముగిసే ఈ సేవలను.. వేడుకల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో రెండు గంటలు పొడిగించారు. అన్ని ప్రారంభ స్టేషన్ల నుండి చివరి రైలు ఒంటిగంటకు బయలుదేరుతుంది. భద్రత కోసం రైళ్లు , స్టేషన్లలో పోలీసుల నిఘా పటిష్టంగా ఉంటుందని.. ప్రయాణికులు నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మెట్రో యాజమాన్యం సూచించింది.