పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ.. ముస్లింలు అంతా నల్ల రిబ్బన్లు ధరించి ప్రార్థనలు చేయాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన శాస్త్రిపురంలోని ఓ మసీదు వద్దకు వెళ్లి అందరికీ నల్ల రిబ్బన్లను పంపిణీ చేశారు. అక్కడి నుంచి మక్కా మసీదుకు వద్దకు చేరుకుని నల్ల రిబ్బన్లు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. అయితే, ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్, మక్కా మసీద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలను తాను కూడా సమర్థిస్తున్నట్లుగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు.