పొద్దస్తమానం యూట్యూబ్‌లో వీడియోలు చూడటమే పని.. చివరకు ఎంతకు తెగించారంటే?

8 months ago 13
ఒంగోలు సమీపంలోని క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న ఏడుగురు బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థులు ఓ ముఠాగా ఏర్పడి బుల్లెట్‌ బైక్‌లను చోరీలు చేయడం ప్రారంభించారు. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 లక్షల విలువైన 16 బుల్లెట్‌ బైక్‌లను చాకచక్యంగా అపహరించారు. అంతా బాగానే జరుగుతోందనుకుంటున్న సమయంలో వీరి బండారం బయటపడి.. ఇప్పుడు జైలుకి వెళ్లారు. బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరకొండ తిరునాళ్లకు వచ్చిన ఓ వ్యక్తి తన బుల్లెట్‌ బైక్‌ను హైవే రోడ్ మార్జిన్‌లో పార్క్‌ చేసి తిరునాళ్లకు వెళ్లాడు. ఆ తరువాత వచ్చి చూసుకుంటే బండి కనిపించలేదు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అటు అద్దంకి పట్టణంలో చిన్నగానుగపాలెం, కాకానిపాలెం, దామావారిపాలెం, సింగరకొండ గుడి, ఓల్డ్ ఆంధ్ర బ్యాంక్‌ దగ్గర వివిధ ప్రాంతాలలో కొంతకాలం నుంచి బుల్లెట్ వాహనాలు వరుస చోరీలకు గురవుతున్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఒకే తరహాలో బుల్లెట్‌ బైక్‌లు మాయం అవుతున్నాయని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీనిపై బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఈ బుల్లెట్‌ బైక్‌ల చోరీలను సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. చీరాల డీఎస్సీ ఎండి మొయిన్‌ ఆధ్వర్యంలో అద్దంకి పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బైక్‌లను చోరీ చేస్తున్న ముఠాపై నిఘా పెట్టారు. వారంతా ఇంజినీరింగ్ విద్యార్థులు అని తెలిసి షాక్ అయ్యారు. అలా ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేశారు. చోరీలు చేసిన బుల్లెట్‌ బైక్‌లలో కొన్నింటిని దర్జాగా వాడుకుంటూ మిగిలిన వాటిని అమ్ముకునేందుకు అద్దంకి సమీపంలోని బ్రహ్మానంద కాలనీలో ఓ పాడు బడిన బిల్డింగ్ దగ్గర దాచిపెట్టారు. మంగళవారం అద్దంకి వచ్చి చోరీ చేసిన బుల్లెట్ బండ్లను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆ ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అనేక మార్గాలను అన్వేషించారు. ఏకంగా యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి బుల్లెట్ బండ్లు దొంగతనం చేసే విధానాన్ని చూశారు. ఇక దీనిని అమలు చేస్తూ నిత్యం చోరీలకు పాల్పడ్డారు. వారు చోరీలు ఎలా చేశారనే విషయాన్ని పోలీసులు వివరించారు.
Read Entire Article