నటుడు పోసాని కృష్ణమురళికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. వరుసగా బెయిల్స్ రావడంతో ఇవాళ జైలు నుంచి విడుదల ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఈలోపే పోసానికి సీఐడీ పోలీసులు షాకిచ్చారు.. ఆయనకు పీటీ వారెంట్ జారీ చేశారు. పోసానిపై గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్తో కర్నూలు జిల్లా జైలు దగ్గరకు వెళ్లారు. ఈ మేరకు పీటీ వారెంట్పై పోసానిని కోర్టు ముందు సీఐడీ పోలీసులు హాజరుపరచనున్నారు. ఈ మేరకు జైలు నుంచే వర్చువల్గా జడ్జి ఎదుట ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరుకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల్లో ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆయన ఇవాళ జైలు నుంచి విడుదలవుతారనే సమయంలో తాజాగా సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో పోసాని విడుదల ఆగిపోయింది. సీఐడీ పీటీ వారెంట్ మాత్రమే కాదు.. పోసాని కృష్ణమురళిని వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఇవాళ కోర్టు తీర్పు వచ్చి కస్టడీకి ఇస్తే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.