మ్యాన్‌హోల్‌లో పడిన బాలిక.. తల్లి చూడటంతో తప్పిన ప్రమాదం

6 months ago 8
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలిక అకస్మాత్తుగా మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. బాలిక వెనకాలే వస్తున్న తల్లి వెంటనే అప్రమత్తమై.. బిడ్డను బయటకు తీసింది. హైదరాబాద్‌లోని యాకుత్‌పురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాకుత్‌పురాకు చెందిన మహిళ తన ఇద్దరు చిన్నారులను తీసుకొని పాఠశాలకు పంపించేందుకు వెళ్తున్నారు. ఆరేళ్ల బాలిక కాస్త ముందు నడుస్తోంది. రోడ్డు మధ్యలో తెరచుకొని ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. తల్లి వెంటనే ఆమెను బయటకి లాగారు. అక్కడికి పరుగెత్తుకొచ్చిన స్థానికుడొకరు బాలిక స్కూల్ బ్యాగ్‌ను బయటకి తీశారు. మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాలిక తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్తెకు మురికి అంటుకోవడంతో శుభ్రం చేసేందుకు తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. భారీ వర్షం కురిసినప్పుడు వరద ఫోర్స్‌కు మ్యాన్‌హోల్ మూతలు తెరుచుకుంటున్నాయి. కొన్ని చోట్ల వరద నీరు వెళ్లిపోయేందుకు కొంత మంది మ్యాన్‌హోల్ మూతలను తెరిచి పెడుతున్నారు. వరద తగ్గిన తర్వాత ఆ మూతలను వేయడం మర్చిపోతున్నారు. ఏమరపాటుగా ఉంటే, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. పాదచారులు, ద్విచక్రవాహనదారులకు రాత్రి వేళల్లో ఇది మరింత ప్రమాదకరం.
Read Entire Article