రాజమండ్రి జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదల

6 months ago 10
వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు మధ్యంతర బెయిల్‌ లభించడంతో శనివారం మధ్యాహ్నం ఆయన జైలు నుంచి బయటికి వచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు శనివారం మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి 11వ తేదీన సరెండర్‌ కావాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి పేరును సిట్ ఏ4గా చేర్చింది. అయితే, ఈ కేసులో తాను అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును మిథున్ రెడ్డి ఆశ్రయించారు. అయితే, ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు జూలై 19వ తేదీన సిట్ ఎదుట విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యారు. సుదీర్ఘంగా ఆయన్ని విచారించిన అనంతరం అదేరోజు రాత్రి సిట్‌ అరెస్ట్‌ చేసింది. అప్పటి నుంచీ ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు, ఆయనకు బెయిల్ కోసం న్యాయవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఓటు వేసేందుకు తనకు మధ్యంత బెయిల్ మంజూరు చేయాలని మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. అయితే, మిథున్‌రెడ్డి పిటిషన్‌కు అర్హత లేదని సిట్‌ వాదించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపుతూ బెయిల్ కోరడం సహేతుకం కాదు అని అభిప్రాయపడింది. అయితే, కోర్టు మాత్రం మిథున్‌రెడ్డి తరఫు లాయర్ల వాదనకే మొగ్గు చూపిస్తూ మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. సెప్టెంబర్‌ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. 11వ తేదీన మళ్లీ మిథున్ రెడ్డి జైల్లో సరెండర్ కానున్నారు.
Read Entire Article