తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోపై ప్రతిపక్షాలు విమర్శలు చేయగా.. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ రిజర్వేషన్లు కేవలం రాజకీయాల కోసమే కాదని.. విద్య, ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరి హక్కులనూ లాక్కోవడం లేదని.. ఈ రిజర్వేషన్లకు ఎవరూ అడ్డుపడవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు తాము సహకరించామని గుర్తు చేస్తూ.. బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే బీసీ వర్గాలు మౌనంగా ఉండవద్దని ఆయన పిలుపునిచ్చారు.