నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా.. సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ సీఎం కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, దీనిని పూర్తి చేసే బాధ్యత కూడా తమదేనని స్పష్టంచేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్చడం ద్వారా కేసీఆర్ పాలమూరు ప్రజలను ఏడాది పాటు గోస పెట్టారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్ కాదా..? అంటూ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించేందుకు కేసీఆర్ సహకరించాడని, ఆర్డీఎస్ ద్వారా అదనపు జలాలను తరలించినప్పుడు హరీష్ రావు వైఎస్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కేసీఆర్ కేవలం మౌనంగా ఉండిపోయారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజలు కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టినప్పటికీ, ఆయనే పదేళ్లు పాలమూరు ప్రాంతాన్ని ఎండబెట్టారని ఆరోపించారు. పాలమూరు ప్రజలకు కేసీఆర్ చేసిన పాపాలే శాపంగా మారాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.