వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఎంవీవీ బిల్డర్స్, హయగ్రీవ డెవలపర్స్తో పాటు పలు సంస్థలు, వ్యక్తులకు చెందిన 44 కోట్ల 74 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ ఎక్స్ ద్వారా ఒక ప్రకటన చేసింది. వృద్ధులు, అనాథలకు ఇళ్లు నిర్మించేందుకు హయగ్రీవ ఫామ్స్ అండ్ డెవలపర్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా వాడుకున్నట్టు తమ విచారణలో తేలిందని ఈడీ పేర్కొంది. ఈ కేసులో భాగంగా 42 కోట్ల 3 లక్షలు విలువ చేసే 14 స్థిరాస్తులను, 2 కోట్ల 71 లక్షల విలువ చేసే ఆరు చరాస్తులను అటాచ్ చేసినట్టు ప్రకటించింది. ఈ అటాచ్డ్ ప్రాపర్టీస్.. ఎంవీవీ బిల్డర్స్, హయగ్రీవ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, గద్దె బ్రహ్మాజీ.. ఆయన భార్య, చిలుకూరి జగదీశ్వరుడు, చిలుకూరి రాధారాణి, హయగ్రీవ ప్రాజెక్ట్స్, వారణాసి డిలీఫ్లకు చెందినవని ఈడీ తెలిపింది.