రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన కడప ఉక్కు కర్మాగారం పనులు ఎట్టకేలకు పట్టాలెక్కుతున్నాయి. జేఎస్డబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. కూటమి ప్రభుత్వం చొరవతో తాజాగా 1100 ఎకరాల భూమిని ఏపీఐఐసీ నుంచి జేఎస్డబ్ల్యూకు బదిలీ చేస్తూ ఒప్పందం కుదిరింది. రెండు దశల్లో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. మొదటి దశను 2029 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.